బొల్లారంలో మద్రాస్ రెజిమెంట్లో ఆర్మీ ఆయుధాల చోరీ; 12 ఆయుధాలు మాయం
సికింద్రాబాద్లోని బొల్లారం ప్రాంతంలో ఉన్న 20వ మద్రాస్ రెజిమెంట్లో ఆగస్టు 31 ఉదయం ఆర్మీ ఆయుధాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. బెటాలియన్ మ్యాగజైన్ నుంచి మొత్తం 12 ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
ఆగస్టు 30 సాయంత్రం 6 గంటల వరకు ఆయుధాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆగస్టు 31 ఉదయం 7:50 గంటలకు మ్యాగజైన్ తాళాలు పగలగొట్టి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాయమైన వాటిలో నాలుగు AK-47 రైఫిళ్లు, ఆరు పిస్తోళ్లు, ఒక INSAS రైఫిల్, మందుగుండు సామగ్రి ఉన్నాయని సమాచారం.
ఆర్మీ అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు BNS సెక్షన్లు 331(4), 305 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయుధాల లాట్ నంబర్లను ఆర్మీ అధికారులు పోలీసులకు అందించారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆయుధాలు భారీగా ఉండటంతో ఒక్కరే వాటిని తరలించే అవకాశం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం లేనందున ఆర్మీ సిబ్బందిలోనే కొందరికి చోరీలో ప్రమేయం ఉండొచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. సిబ్బందిని అంతర్గతంగా విచారిస్తున్నారు.
ఈ ఘటనపై ఆర్మీ, పోలీసు అధికారులు సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com