BJD లో చేరిన సీనియర్ IAS అధికారి సుజాత కార్తికేయన్
ఒడిశాలో సీనియర్ IAS అధికారి సుజాత కార్తికేయన్ రాజకీయ ప్రవేశం సంచలనం కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో ఆమె BJD లో చేరారు. ఒడిశా రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.
సుజాత భర్త VK పాండ్యన్ గతంలో నవీన్ పట్నాయక్ కు కుడిభుజంగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో BJD ఓటమి తర్వాత పాండ్యన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సుజాత BJD లో చేరడం మరోసారి సంచలనంగా మారింది.
BJD లో సుజాతకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు సుజాత తెలిపారు. ఒడిశా ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పేర్కొన్నారు.
IAS అధికారిగా సుజాత కార్తికేయన్ మావోయిస్టు ప్రభావిత సుందర్గడ్ జిల్లాలో కలెక్టర్ గా పని చేశారు. చలనశీలతే సాధికారత అనే నినాదంతో ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం సైకిల్ పథకాన్ని ప్రారంభించిన వ్యక్తిగా ఆమె ప్రసిద్ధి చెందారు. పాఠశాలల్లో బాలికల నమోదును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.
హింసాత్మక జిల్లాల్లో యువతను మావోయిస్టుల ప్రభావం నుంచి దూరం చేయడానికి ఆమె ఫుట్బాల్ వంటి క్రీడలను ప్రోత్సహించారు. బాలికలు మరియు బాలుర కోసం స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటు చేశారు. సుజాతను సర్వీస్ నుంచి రిలీజ్ చేయాలన్న అభ్యర్థనను కేంద్రం ఆమోదించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com