RBI 10, 20 రూపాయల పాలిమర్ నోట్ల ప్రయోగాత్మక ముద్రణకు కేంద్రం ఆమోదం
RBI ప్రతిపాదించిన 10, 20 రూపాయల పాలిమర్ నోట్ల ప్రయోగాత్మక ముద్రణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారు. 1 బిలియన్ 10 రూపాయల నోట్లు, 1 బిలియన్ 20 రూపాయల నోట్లు మొత్తం 2 బిలియన్ పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ కోసం ముద్రించనున్నారు.
పాలిమర్ నోట్లు ప్రత్యేక ప్లాస్టిక్ తయారీ. సాధారణ కాగితపు నోట్ల మాదిరిగా ఇవి త్వరగా చినిగిపోవు, నీటిలో తడిస్తే పాడవ్వు. మురికి తక్కువగా పడుతుంది, నకిలీ నోట్ల తయారీ కూడా కష్టం. ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీ వాడుతున్నాయి.
ప్రస్తుతం ఇచ్చిన అనుమతి కేవలం ఫీల్డ్ ట్రయల్స్ కోసమే. ఈ ట్రయల్స్ లో వివిధ ప్రాంతాల్లో నోట్లను పరీక్షించి, వాటి మన్నిక, ప్రజల స్పందన, ఏటీఎంలు, బ్యాంకింగ్ వ్యవస్థలతో అనుకూలత, ముద్రణ నాణ్యత వంటి అంశాలను పరిశీలిస్తారు. ట్రయల్స్ విజయవంతమైతేనే దేశవ్యాప్తంగా విడుదలపై నిర్ణయం తీసుకుంటారు.
దీర్ఘకాలంలో పాలిమర్ నోట్ల వల్ల ప్రభుత్వానికి ముద్రణ ఖర్చు తగ్గే అవకాశం ఉంది. నోట్ల జీవితకాలం పెరగడంతో తరచు కొత్తగా ముద్రించాల్సిన అవసరం ఉండదు. ఆధునిక భద్రతా ఫీచర్లతో నకిలీ కరెన్సీ నియంత్రణకు కూడా ఇవి ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
చలామణిలో ఉన్న కాగితపు నోట్లను ప్రజలు ఎప్పటిలానే వాడొచ్చు. పాలిమర్ నోట్లు వెంటనే మార్కెట్ లోకి రావు. ఫీల్డ్ ట్రయల్స్ ఫలితాల తర్వాతే వీటి భవిష్యత్తు నిర్ణయమవుతుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com