సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు: వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా ఆయన వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయమని చంద్రబాబు పిలుపునిచ్చారు. భారతదేశం సంస్కరణలతో ఆర్థిక శక్తిగా మారిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఉందని ఆయన అన్నారు. చైనా లాంటి దేశాలకు ఆర్థిక వృద్ధికి దశాబ్దాల కాలం పట్టిందని, కానీ భారతదేశానికి అంత సమయం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ సంస్కరణలతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు.
డెమోగ్రఫిక్ డివిడెండ్ ద్వారా భారతదేశం అతి పెద్ద యువ మానవ వనరుల దేశంగా ఉందని చంద్రబాబు చెప్పారు. మెడికల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ పరికరాలు ప్రస్తుతం భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఐదవ తరం ఫైటర్ జెట్లతో సహా వివిధ రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేసే ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.
తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్' విధానాన్ని అనుసరిస్తోందని ఆయన చెప్పారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఆర్సలర్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు, భూములు కేటాయించామని ఉదహరించారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో భారతదేశం 500 గిగావాట్లు ఉత్పత్తి చేయగా, ఆంధ్రప్రదేశ్ 160 గిగావాట్లు సమకూర్చనుందని పేర్కొన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు అవకాశం ఉందని, వెంచర్ క్యాపిటలిస్టులు ఆ హబ్ ప్రోత్సహించిన స్టార్టప్లపై దృష్టి పెట్టవచ్చునని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి ఒరిజిన్ వెంచర్స్, ఆటోమోనిక్స్ ఎల్ఎంఏఐటీ వెంచర్స్, ఆప్టిమం సొల్యూషన్స్, క్వానా క్యాపిటల్, జంగల్ వెంచర్స్ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
అంతకుముందు రోజు ముఖ్యమంత్రి సింగపూర్లోని భారత హైకమిషనర్తో భేటీ అయ్యారు. భారత్-సింగపూర్ మధ్య కుదిరిన ఆర్థిక, వాణిజ్య ఒప్పందాల గురించి హైకమిషనర్ వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్ ఎంఆర్వో కేంద్రాల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు సింగపూర్ కంపెనీలను కోరారు. రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్వేర్ రంగాల్లో సహకారంతో పాటు ఏపీ, సింగపూర్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం కోసం కృషి చేయాలని కోరారు.
అనంతరం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com