ఖమ్మంలో ఈ నెల 30న రైతు ఆశీర్వాద సభ – సీఎం చేతుల మీదుగా రైతు భరోసా నిధుల విడుదల
ఖమ్మం జిల్లా చింతకాలి మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 30న రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభా స్థలిని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ సందర్భంగా వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు రోజుల మెగా రైతు మేళా నిర్వహించనున్నారు.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ యంత్రాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సేంద్రీయ ఉత్పత్తులు, అనుబంధ రంగాల పరికరాలను ఈ స్టాల్స్లో ప్రదర్శించనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 5,000 మంది చొప్పున రెండు రోజుల్లో 10,000 మంది రైతులు పాల్గొనే అవకాశం ఉంది. రైతులకు రవాణా సౌకర్యంతో పాటు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com