తెలంగాణ ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరత: సమగ్ర శిక్ష నివేదికలో వెల్లడి
తెలంగాణలోని 4,739 ప్రాథమిక పాఠశాలలు ఒకే ఒక టీచర్తో నడుస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన సమగ్ర శిక్ష PAB నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 30,057 ప్రభుత్వ పాఠశాలల్లో 26.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ రంగంలో 12,474 స్కూళ్లలో 47.52 లక్షల మంది ఉన్నారు.
ప్రాథమిక స్థాయిలో ఒకే టీచర్తో కొనసాగే బడుల సంఖ్య 24%గా ఉంది. అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఈ సంఖ్య 80 నుంచి 93కి పెరిగింది. టీచర్-స్టూడెంట్ నిష్పత్తి అప్పర్ ప్రైమరీలో 14.8 నుంచి 18.6%కి చేరింది. 11,801 ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు లేని జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు 1,809 నుంచి 1,997కు పెరిగాయి.
సెకండరీ స్థాయిలో డ్రాప్ అవుట్ రేటు గత ఏడాది 8% నుంచి 10.5%కి పెరిగింది. ఇది జాతీయ సగటు 8.2% కంటే ఎక్కువ. 95% కంటే ఎక్కువ బడుల్లో నీరు, కరెంటు సౌకర్యాలు ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్య అందించడంలో వెనుకబాటు ఉందని నివేదిక పేర్కొంది.
కేంద్రం నుంచి మంజూరైన నిధులను సకాలంలో ఖర్చు చేయడంలో రాష్ట్రం వెనుకబడినట్లు తేలింది. ఏప్రిల్ 1 నాటికి ₹163.04 కోట్లు ఖర్చు కాలేదు. 2018 నుంచి 2021 మధ్య మంజూరైన పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. DIET కాలేజీల్లో మంజూరైన 286 పోస్టుల్లో 151 ఖాళీలు ఉన్నట్లు రిపోర్ట్ లెక్కచెప్పింది. టీచర్ నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారికి సరైన శిక్షణ లేకపోవడంతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తక్కువగా ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com