సొంత డబ్బులతో ఆటోలు పెట్టించి విద్యార్థులను బడికి రప్పిస్తున్న ఆదిలాబాద్ ఉపాధ్యాయులు
ఆదిలాబాద్ జిల్లాలోని కొలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం సొంత డబ్బులతో ఆటోలు ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా పాఠశాలకు రప్పిస్తున్నారు. ఈ పాఠశాలకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో KRK కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. అక్కడ చదివే విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వచ్చేందుకు బస్సు సౌకర్యం లేకపోవడం, తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో చదువు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితిని గుర్తించిన కొలిపుర పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల రవాణా బాధ్యత తమపై తీసుకున్నారు. ప్రతి సంవత్సరం మూడు ఆటోలు ఏర్పాటు చేసి 58 నుండి 60 మంది విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 68 మంది విద్యార్థులు ఉండగా వారిలో 54 మంది ఆటోల ద్వారా వస్తున్నారు. ఏటా రెండు నుండి మూడు లక్షల రూపాయల వరకు ఉపాధ్యాయులే ఖర్చు భరిస్తున్నారు.
2024 DSC లో మొదటి ర్యాంక్ సాధించిన శారీరక విద్య ఉపాధ్యాయుడు సైతం ఈ సహాయంలో పాలుపంచుకుంటున్నారు. గతంలో వెలవెలబోయిన ఈ పాఠశాల నేడు పదుల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడుతోంది. ఉపాధ్యాయుల చొరవను గుర్తించిన ఆటో నడిపేవారు సైతం తక్కువ అద్దెకు సేవలు అందిస్తున్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, లక్ష్యం సాధిస్తామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com