విజయ డెయిరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి కొల్లు రవీంద్రకు రాజీనామా లేఖ అందజేశారు. ఆయన బోర్డు డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
2019 నుంచి చలసాని ఆంజనేయులు విజయ డెయిరీలో డైరెక్టర్గా ఉన్నారు. 2019లో మొదటిసారి చైర్మన్గా ఎన్నికై, 2021లో రెండో సారి ఆ పదవిని చేపట్టారు. ఈ నెల 6న మూడో సారి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. ఈసారి నామినేషన్ వేయవద్దని టీడీపీ నాయకత్వం సూచించినా ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది.
పార్టీ విజ్ఞప్తి మేరకు మంత్రి కొల్లు రవీంద్ర చలసాని ఆంజనేయులతో చర్చలు జరిపారు. వెంటనే రాజీనామా చేయాలని సూచించగా ఆయన విముఖత వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆంజనేయులను కలిసి మంత్రి మరోసారి చర్చించారు. చివరకు ఆయన రాజీనామాకు అంగీకరించారు.
చలసాని ఆంజనేయులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేశారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో కొత్త చైర్మన్ నియమిస్తామన్నారు. ప్రస్తుత పదవీ కాలం సెప్టెంబర్ 30 వరకు ఉంది. అప్పటి వరకు డైరెక్టర్లలో ఒకరు తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ ప్లాంట్కు టైటిల్ డీడ్ ఇవ్వాలని ఆంజనేయులు చేసిన విజ్ఞప్తిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com