మత్స్యకారుల బోట్లకు కొత్త రంగు? కోస్ట్ గార్డ్ సూచనపై ఫిషరీస్ శాఖ స్పందన
భారత కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా రాష్ట్ర మత్స్య శాఖకు ఒక కీలక ప్రతిపాదన చేశాయి. సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు మత్స్యకారుల బోట్లను త్వరగా గుర్తించడానికి బోటు రంగు మార్పు చేయాలని సూచించాయి.
ప్రస్తుతం ఫిషింగ్ బోట్లకు పసుపు, నీలం రంగులు వాడుతున్నారు. అందులో బోటు అడుగు భాగం నీలం రంగులో ఉంటుంది. సముద్ర జలాల రంగు కూడా నీలం కావడంతో, బోటు మునిగిపోతే గుర్తించడం కష్టమవుతుందని కోస్ట్ గార్డ్ అధికారులు వివరించారు.
ఈ అంశంపై ఫిషరీస్ జేడి వర్ధన్ స్పందిస్తూ, కోస్ట్ గార్డ్ ప్రతిపాదనను కమీషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రజాభిప్రాయం సేకరించి కమీషనర్కు నివేదించనున్నట్లు, ఆ తర్వాత ఇతర అధికారులతో చర్చించి రంగుల మార్పుపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
వర్ధన్ మాట్లాడుతూ, ప్రతి బోటుకు ఉచితంగా ట్రాన్స్పాండర్లను అందిస్తున్నామని, వీటిలో లొకేషన్ ట్రాకింగ్, చేపల సమాచారం, అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినప్పుడు హెచ్చరిక, SOS బటన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. కానీ చాలా మంది మత్స్యకారులు వీటిని సరిగ్గా ఆన్ చేయకపోవడంతో ప్రమాద సమయంలో సిగ్నల్ అందడం లేదని, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఐఎండి హెచ్చరికలు వచ్చిన వెంటనే స్థానిక సంఘాలు, సాగర్ మిత్రలు, పోర్టులో మైక్ ప్రకటనలు, బంధువులకు ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం చేరవేస్తామని, బోట్లను వెనక్కి రమ్మని సూచిస్తున్నామని జేడి చెప్పారు. మత్స్యకారుల భద్రత దృష్ట్యా కోస్ట్ గార్డ్ సూచనలను పరిశీలించి, మత్స్యకారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com