పన్ను ఎగవేతలపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పంచాయతీలకు పరిశ్రమలు మరియు విద్యా సంస్థల పన్ను ఎగవేతపై అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, హేచరీలు మరియు ఇతర సంస్థల నుంచి పన్నుల వసూళ్లలో ఉన్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల మౌలిక సదుపాయాలు వినియోగించుకుంటున్న సంస్థలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు.
పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యా సంస్థలు మరియు పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు.
పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనానికి DPO లతో కలిపి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు మరియు విద్యా సంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ అసైన్మెంట్ నిర్వహించాలని తెలిపారు. పన్నుల వసూళ్లలో అవకతవకలు సహించమని, గత 30 సంవత్సరాలలో అన్యాక్రాంతమైన పంచాయతీల ఆస్తులపై నివేదిక ఇవ్వాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com