దేశంలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. ఆరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్లోని బలేసా, కల్జుగాసిర్ ప్రాంతాల్లో కుండపోత వానలతో పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. క్లౌడ్బర్స్ట్ వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాట్యాస్ ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోంలో ఎడతెరిపి లేని వానలతో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గుజరాత్లోని వాపీలో వరద నీరు నిలిచిపోయింది. మహారాష్ట్రలో ముంబై నేవీ నగర్, వర్లీ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక తీర ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 4-5 రోజుల్లో దక్షిణ గుజరాత్, గోవాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ భారీ వర్ష సూచన ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com