హర్మూజ్ సంధిలో నౌకలపై దాడులను ఐరాస భద్రతా మండలిలో భారత్ ఖండించింది
హర్మూజు జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మధ్యప్రాచ్య శాంతి భద్రతలపై జరిగిన చర్చలో భారత్ ఈ వైఖరిని వెల్లడించింది.
ఈ దాడుల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో సుమారు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన తెలిపారు. భారత వాణిజ్యం, ఇంధన సరఫరా పశ్చిమాసియా స్థిరత్వంపై ఆధారపడి ఉన్నాయని, అక్కడ చిన్న అంతరాయం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హరీష్ చెప్పారు.
దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలను ఆపడంలో ఐరాస విఫలమవుతోందని, దీనివల్ల సంస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని హరీష్ అన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో శాశ్వత, అశాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఓమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురు గల్లంతయ్యారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com