జూబ్లీ హిల్స్ తనూజ హత్య కేసు: నిందితురాలు కల్పన నేపాల్ పారిపోయినట్లు అంచనా
హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో విశ్రాంత IPS అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు కల్పన నేపాల్ చేరినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
పూణేలో పని చేసిన కల్పనకు అక్కడ వికాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఎనిమిది నెలల క్రితం ఆమె వినయ్ రంజన్ రే ఇంట్లో పనిలో చేరింది. కల్పన నుంచి ఇంటి వివరాలు తెలుసుకున్న వికాస్ దోపిడీకి పథకం వేశాడు.
వినయ్ రంజన్ రే బెంగళూరు వెళ్ళినప్పుడు నిందితులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పూణే, ముంబై, బెంగళూరు నుంచి ఎనిమిది మంది నేపాలీ యువకులను హైదరాబాద్ చేర్చారు. మొత్తం తొమ్మిది మంది ఈ దోపిడీలో పాల్గొన్నారు.
దోపిడీ తర్వాత నిందితులు జూబ్లీ హిల్స్ నుంచి ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. తెలంగాణ ఎక్స్ప్రెస్లో కాజీపేట్ వరకు ప్రయాణించారు. అక్కడ సెల్ఫోన్లు పగలకొట్టి ఆధారాలు లేకుండా చేసుకున్నారు. సొత్తు వాటాలు పంచుకొని వేరు వేరు రైళ్లలో పారిపోయారు.
ముఠా సభ్యుడు సునీల్ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు వికాస్ కూడా పూణే నుంచి నేపాల్ పారిపోయినట్లు సమాచారం.
మిగతా నిందితుల కోసం 12 పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. పూణే, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో సోదింపులు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు నేపాలీ పౌరులు నివసించే ప్రాంతాలపై దృష్టి పెట్టారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com