వర్షాకాలంలో కంది సాగు: పూత దశలో పురుగుల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
తెలంగాణలో ఖరీఫ్ కంది పంట ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఈ దశలో పంటపై వివిధ రకాల పురుగుల దాడి జరిగే ప్రమాదం ఉందని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం. మధు హెచ్చరించారు. మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు వంటివి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆశించినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో రైతులకు ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. కంది మొక్కల ఎత్తు పెరిగి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే, తలలు తుంచడం (నిప్పింగ్) చేపట్టాలి. పై నుంచి 10-15 సెంటీమీటర్ల మేర తుంచితే పక్క కొమ్మలు విస్తరించి పూత 10-20% పెరిగి దిగుబడిలో 10-15% అధిక లాభం వస్తుందని వివరించారు. కలుపు నివారణకు ఇమజితాపైర్ 300 మి.లీ. లేదా క్విజలోపాప్ ఇథైల్ 400 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. అలాగే అంతర కృషి కోసం ట్రాక్టర్ లేదా మినీ డాక్టర్ వాడవచ్చు.
పురుగుల నివారణకు ముందస్తు చర్యలు తప్పనిసరి. వేప నూనె 1500 పిపిఎం 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే తల్లి పురుగులు గుడ్లు పెట్టవు. ఒకవేళ పురుగు కనపడితే క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ., క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి వాడాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ. ఎకరానికి పిచికారి చేసుకోవచ్చు. శనగపచ్చ పురుగు నియంత్రణకు ఫెర్మోన్ ట్రాప్లు ఎకరానికి 4 (గమనింపు) నుంచి 8 దాకా (నియంత్రణ) అమర్చాలని సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com