అమెరికాతో సంబంధాలు పెరిగినా భారత-రష్యా సంబంధాలు చెక్కుచెదరవు: పుతిన్
భారత-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్న నేపథ్యంలో, భారత్తో తమ దీర్ఘకాల సంబంధాలు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పష్టం చేశారు. సెయింట్ పెటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల అధినేతలతో సమావేశంలో మాట్లాడిన ఆయన, రష్యా-భారత సంబంధాలు చారిత్రకంగా విశ్వసనీయమైనవని, వీటిని దెబ్బతీసే ప్రయత్నాలు విఫలమవుతాయని అన్నారు.
విదేశాంగ విధానం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు వృధ అని పుతిన్ అభిప్రాయపడ్డారు. అలాంటి చర్యలు ప్రపంచ అస్థిరతకు దారితీస్తాయని హెచ్చరించారు. భారతదేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని, జాతీయ ప్రయోజనాల కోణంలో భారత్ తీసుకునే నిర్ణయాలను తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు. భారత్తో ఉన్న సంబంధాలు విశ్వసనీయ భాగస్వామ్యంపై ఆధారపడి ఉన్నాయని, ఇతర దేశాలతో భారత ఎలాంటి సంబంధాలు కొనసాగించినా అది రష్యా-భారత సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపదని స్పష్టం చేశారు.
భారత ఆర్థిక వృద్ధిని కొనియాడిన పుతిన్, ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారుతుందని, అద్భుతమైన వృద్ధి రేటును కనపరుస్తుందని పేర్కొన్నారు. ఈ విజయం రాత్రికి రాత్రి రాలేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేసిన కృషి ఫలితమని చెప్పారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
భారత్-చైనా మధ్య నెలకొన్న వివాదాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పుతిన్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలను రష్యా మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com