నేడు సాయంత్రం తెలంగాణ క్యాబినెట్ సమావేశం — జూన్ 2 పథకాలపై చర్చ
తెలంగాణ CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్న పలు పథకాల విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు ఈ సమావేశంలో చర్చించే కీలకమైన అంశాల్లో ఒకటి. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేయగా, రెండో విడత సంఖ్య ఎంత ఉంటుందో ఇవాళ తేల్చే అవకాశం ఉంది. ఈసారి పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ స్థలాలు గుర్తించారనే అంశంపై సమావేశంలో చర్చ జరుగుతుంది.
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వర్తించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జూన్ 2 నుండి అమలు చేయాలని ప్రభుత్వం ముందే నిర్ణయించింది. ఆ పథకం విధి విధానాలపై కూడా క్యాబినెట్లో చర్చ జరగనుంది.
ఫీజు రీయింబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల bank ఖాతాల్లో జమ చేయడం, private, corporate విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, చేయుత పెన్షన్ల అమలు, solar stove పథకం, పంట మార్పిడి ప్రణాళిక అమలుపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు — ఇవి కూడా చర్చకు వచ్చే అంశాల్లో ఉన్నాయి.
నష్టాల్లో ఉన్న డిస్కమ్లను లాభాల వైపు మళ్ళించేందుకు ఉద్దేశించిన విద్యుత్ రంగ సంస్కరణలు, HAMC రోడ్ల నిర్మాణ వేగవంతం, అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన పొదుపు చర్యలపై కూడా చర్చ జరగనుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com