తెలంగాణలో భారీ వర్షాలు: పలు ప్రాజెక్టులకు జలకళ
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి, కృష్ణా నదులకు ఎగువనుంచి భారీగా వరద నీరు చేరుతోంది.
పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ 13 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం 20 టీఎంసీలు. ఇన్ఫ్లో 46,042 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 12,975 క్యూసెక్కులుగా ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తివేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 81,060 క్యూసెక్కులుగా ఉన్నాయి. జూరాల ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 91,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 81,695 క్యూసెక్కులు. నీటి నిల్వ 7.371 టీఎంసీలు కాగా, జల విద్యుత్ కేంద్రాల నుంచి 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
నిజామాబాద్ జిల్లా శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. నీటి నిల్వ 16.96 టీఎంసీలు. సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ 4.25 టీఎంసీలు. నిజాం సాగర్లో 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు చేరింది.
నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్ట్ నీటి మట్టం 1174 అడుగులకు, కడం ప్రాజెక్ట్ 691 అడుగులకు చేరాయి. కొమరం భీం జిల్లా వట్టిబాగు ప్రాజెక్టులో 3 గేట్లు ఎత్తివేశారు.
భారీ వర్షాలతో కొమరం భీం జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్, కొమరం భీం జిల్లాల్లో నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com