తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం; నాణ్యమైన యూనిఫామ్లు, పుస్తకాలు
తెలంగాణలో ఈ రోజు (జూన్ 17) నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత కారణంగా జూన్ 12 వరకు ఉన్న వేసవి సెలవులను ఆదివారం (జూన్ 16) వరకు పొడిగించారు. దీంతో నేటి నుంచి విద్యార్థులు మళ్ళీ బడుల బాట పట్టారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లతో పాటు బ్రాండెడ్ షూస్, సాక్స్, టై, బెల్ట్ లు అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన వస్త్రాలతో యూనిఫామ్లు సిద్ధం చేస్తున్నారు. గురుకుల విద్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్ల కోసం ముఫల్తాల్ (పేరెన్నికగల సంస్థ) నుంచి వస్త్రాన్ని సేకరిస్తున్నారు.
యూనిఫామ్లతో పాటు స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్లు, టై, బెల్ట్, బెడ్డింగ్ సామాగ్రి, ప్లేట్, గ్లాస్, కటోరా వంటివి కూడా ఇవ్వనున్నారు. ప్రభుత్వం నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని అధికారులు తెలిపారు.
మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ల కోసం 2.97 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రోజే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు పంపిణీ చేస్తారు. ఇంకా, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. తొలిదశలో కిచెన్ షెడ్లు ఉన్న ఎనిమిది జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com