రామంతపూర్ నల్లచెరువు సుందరీకరణలో ఉద్రిక్తత: వ్యాపారుల నిరసన
హైదరాబాద్లోని రామంతపూర్ నల్లచెరువు సుందరీకరణ పనుల సందర్భంగా ఆగస్టు 20 అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైడ్రా అధికారులు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడంతో స్థానిక పండ్ల వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు.
రూ.19 కోట్ల వ్యయంతో హైడ్రా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్లో భాగంగా చెరువు సమీపంలోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇదే సమయంలో రాత్రి వేళల్లో పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఫ్లైఓవర్ నిర్మాణం, బస్స్టాప్ ఏర్పాటు వంటి కారణాలతో వీరిని పలుమార్లు తరలించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా తొలగిస్తే జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
“మొదట ఉప్పల్ రోడ్డుపై బండ్లు పెట్టి అమ్ముకునేవాళ్లం. అక్కడ ప్లైఓవర్ వచ్చాక చెరువు కట్టపైకి మార్చారు. తర్వాత బస్టాప్ కోసం కాస్త ముందుకు జరిపారు. ఇప్పుడు మళ్లీ గోడ కడుతున్నారు, మమ్మల్ని తొలగిస్తున్నారు” అని ఓ వ్యాపారి తెలిపారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ వ్యాపారం చేసుకునేందుకు చోటు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
హైడ్రా అధికారుల తరఫున ఈ వ్యాపారులకు ప్రత్యామ్నాయం ఎప్పుడు చూపుతారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితి సద్దుమణిగినట్లు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com