దొంగలించిన బంగారం, నగదు తిరిగి ఇచ్చి క్షమాపణ లేఖ రాసిన దొంగలు.. కాకినాడలో ఘటన
కాకినాడ జిల్లా కరప మండలం రామకంచి రాజునగర్లో ఓ ఇంట్లో జరిగిన చోరీలో దొంగలు దొంగిలించిన బంగారు ఆభరణాలు, నగదును తిరిగి ఇచ్చి క్షమాపణ లేఖ రాసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు నామాల గణేష్ అనే వ్యాపారి జూన్ 23న కుటుంబంతో తిరుపతికి వెళ్లి జూలై 18న తిరిగి వచ్చే సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు 48 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేల నగదు అపహరించారు. మొత్తం నష్టం రూ.6.5 లక్షలుగా అంచనా వేసి గణేష్ కరప పోలీస్లకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ నెల 2వ తేదీ (ఆదివారం) వేకువ జామున, అదే దొంగలు బంగారు నగలు, మిగిలిన నగదు ఒక సంచిలో పెట్టి ఇంటి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు. వారు అక్కడ ఒక క్షమాపణ లేఖ కూడా వదిలారు. ఆ లేఖలో ‘మేము చేసింది తప్పు. దొంగిలించిన నగదులో రూ.22 వేలు మా అవసరాలకు ఖర్చు చేశాం. ఆ డబ్బు తిరిగివ్వలేం. మిగిలిన సొత్తు తిరిగి ఇస్తున్నాం. క్షమించండి’ అని రాశారు.
బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, విచారణ జరిపిన పోలీసులు ఈ చోరీ వెనుక బాధితుడి బంధువులే ఉన్నట్లు గుర్తించారు. గ్రామ పెద్దలు సమావేశమై నిందితులపై చర్చించారు. కొందరు నిందితులను పోలీసులకు అప్పగించాలని, మరికొందరు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదరాలని అభిప్రాయపడ్డారు. చర్చలు ఫలించకపోవడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com