పెద్దపులి సంచారం: తూర్పు గోదావరిలో హై అలర్ట్
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో పెద్దపులి సంచరిస్తోంది. నందిగూడెం, కరకపాడు అటవీ ప్రాంతం నుంచి బుచ్చియపాలెం మీదుగా తొక్కిరెడ్డిగూడెం వైపు పులి కదలికలను అధికారులు గుర్తించారు. తొక్కిరెడ్డిగూడెం సమీపంలోని పొలాల్లో పులి పాదముద్రలు కనిపించాయి.
ఈ నెల ప్రారంభంలో ఏలూరు జిల్లా రామచోడవరం, పోలవరం మండలాల్లో ఇదే పులి కనిపించింది. ప్రస్తుతం ఇది గోపాలపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. వాతావరణం మబ్బుగా ఉండటంతో పులికి అమర్చిన రేడియో ట్రాకింగ్ పరికరం నుంచి స్పష్టమైన సిగ్నల్స్ రావడం లేదు.
రాజమహేంద్రవరం వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు 30 మంది మూడు బృందాలుగా ఏర్పడి, ప్రత్యేక పరికరాలతో పులి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యాంటీనా సిస్టం సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, గోపాలపురం, తైతర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాత్రిపూట మేకలు, దూడలను అటవీ ప్రాంతాల్లో కట్టివేయొద్దని, ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని సూచించారు. పులి జనావాసాల్లోకి రాకుండా అడవిలోకే తరలించేందుకు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com