తిరుమలలో జూన్లో 1.26 కోట్ల లడ్డూ ప్రసాదాలు విక్రయం
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఈ ఏడాది జూన్లో భారీ డిమాండ్ నమోదైంది. మొత్తం 1.26 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయమైనట్టు టిటిడి వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 15 లక్షల లడ్డూలు అధికంగా అమ్ముడయ్యాయి.
ప్రతి భక్తుడు సగటున ఐదు లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు స్వామి దర్శనం తర్వాత వీలైనన్ని లడ్డు ప్రసాదాలను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. భక్తుల రద్దీ పెరగడంతో లడ్డూ విక్రయాలు కూడా పెరిగాయి.
లడ్డూ ప్రసాదం తయారీకి రోజుకు 70 టన్నుల ముడిసరుకు వాడుతున్నారు. ఇందులో 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగ పిండి, 16 టన్నుల నెయ్యి, 1.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల ఏలకులు, 800 కిలోల కలకండ ఉన్నాయి. ప్రతి చిన్న లడ్డూకు సగటున 170 గ్రాముల ముడి పదార్థాలు వాడుతున్నారు.
లడ్డూ ప్రసాదాన్ని 1950లో ఆమోదించిన సాంప్రదాయ దిట్టం ప్రకారం తయారు చేస్తున్నారు. పోటు విభాగానికి కావాల్సిన అన్ని సరుకులు కొనుగోలు విభాగం నుంచి ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వినియోగిస్తున్నట్టు టిటిడి అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com