ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతం; పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. సింహాచల క్షేత్రంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, తాంబూలం అందించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కోట దుర్గమ్మ ఆలయంలో సామూహిక కుంకుమార్చన పూజలు జరిగాయి. ఇందులో 3 వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని 4.5 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు.
తూర్పు గోదావరి జిల్లా ఉనరాజవరం మండలం పాలంగి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి గర్భగుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మహిళలు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. వరలక్ష్మి ప్రతిమలను చిల్లర నాణేలతో ప్రత్యేకంగా అలంకరించారు.
కేంద్రపాలిత ప్రాంతం యానంలో శివాలయం వీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, పడవల వీధిలో లలితా దేవిని, గోపాల్ నగర్లో సరస్వతీ దేవిని పూలు, పండ్లతో అలంకరించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com