విశాఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్పై ముస్సోరీలో కేసు నమోదు
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ముస్సోరీలో మృతి చెందిన ఘటనలో పోలీసులు భర్త శ్రీచరణ్ పై కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముస్సోరీ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది.
సుధాకర్ తన ఫిర్యాదులో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీచరణ్ తమ కుటుంబానికి ఋషికేశ్, హరిద్వార్ యాత్ర గురించి చెప్పలేదని, ముస్సూరి వెళ్లే విషయం కూడా తెలియజేయలేదని పేర్కొన్నారు. 14వ తేదీ అర్ధరాత్రి 1:38 గంటలకు శ్రీచరణ్ ఫోన్ నుంచి ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సెల్ఫీ ఫోటో రావడం అనుమానాస్పదంగా ఉందన్నారు. వీరు బంగీ జంపింగ్ కు వెళ్లినట్టు చెప్పినా, ఇద్దరి ఫోన్లలో ఆ సంబంధిత ఫోటోలు లేవని తెలిపారు.
సుధాకర్ ముస్సూరీ పోలీసులను కలిసి శ్రీచరణ్ వాట్సాప్ చాట్లు, ఆర్థిక లావాదేవీలు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, కమ్యూనికేషన్ రికార్డులను పరిశీలించాలని కోరారు. అంతకుముందు ఆయన ఉత్తరాఖండ్ డీజీపీని కలిసి తన అనుమానాలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు.
రాధా గాయత్రి భర్త వేధింపుల గురించి తల్లికి చెప్పుకునేదని, ఆహారంలో ఏదైనా కలిపి హత్య చేసి ఉండొచ్చని సుధాకర్ అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com