ఆదిలాబాద్లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. IMD రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు.
గత 24 గంటల్లో జిల్లాలో సగటున 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చోడా, బజారత్నూరు ప్రాంతాల్లో 10 నుండి 11 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. కలెక్టర్, ఎస్పీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మత్తడివాగు ప్రాజెక్ట్ వద్ద ఉన్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉందని, గతంలో గేట్ల ట్రయల్ రన్, సైరన్స్ చెకింగ్ పూర్తయిందని తెలిపారు. కింది గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు.
లో లైయింగ్ కాజ్వేలను మూసివేశారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి అలర్ట్గా ఉన్నారు. గత ఏడాది మన్నూరు ఎస్సీ హాస్టల్, చోడా పీహెచ్సీ వంటి చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఈసారి ఆ సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, డ్రెయినేజీ పనులు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.
కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంప్రదించాలన్నారు. మరో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని, అనవసరంగా బయటకు వెళ్లొద్దని, అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com