అటవీ సిబ్బందిపై ఆదివాసీల ఆందోళన, 24 గంటల్లో చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిక
ఆదిలాబాద్ జిల్లాలో అటవీ అధికారులపై ఆదివాసీలు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా ఇందనపల్లి పరిధిలో ఆదివారం చేపల వేటకు వెళ్లిన తమపై అటవీ సిబ్బంది దాడి చేశారని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన ఇందనపల్లితో పాటు ఆసిఫాబాద్ జిల్లా ఉడుంపూర్ గ్రామస్థులు అటవీ శాఖకు సహాయ నిరాకరణ ప్రకటించారు. అటవీ సిబ్బందికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని తీర్మానించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఈ ఘటనపై స్పందించారు. దాడికి బాధ్యులైన అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ దాడులకు ఎఫ్డీపీ శాంతిరావు ప్రధాన కారణమని, ఆయనపై సస్పెండ్ సహా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమపై అటవీ శాఖ అధికారులు అనవసర దాడులు చేస్తున్నారని, ఇవి ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆదివాసి సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారుల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com