ఏపీలో 74,212 గ్రామీణ ఇళ్లకు కేంద్రం ఆమోదం: మంత్రి పార్దసారధి
ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ 2.0 కింద తొలి విడతలో 74,212 ఇళ్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదల నుంచి 10,42,199 దరఖాస్తులు అందగా, వాటిలో సుమారు 9.5 లక్షల మంది అర్హులని గుర్తించినట్టు మంత్రి తెలిపారు. ఈ అర్హులందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామీణ ఇంటి నిర్మాణానికి యూనిట్ ఖర్చు రూ.2,39,000గా నిర్ణయించినట్టు వివరించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో పట్టణ (అర్బన్) పథకం కింద 57,600 ఇళ్లు మంజూరయ్యాయని, పీఎం-జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన సోదరులు, సోదరీమణుల కోసం 28,430 ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. పోలవరం పునరావాస కేంద్రాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ చేపడుతుందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్ల నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం చేస్తామని పార్దసారధి చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com