బోడుప్పల్ లో 8 నెలల చిన్నారి కిడ్నాప్, మూడు గంటల్లో పోలీసుల రెస్క్యూ
బోడుప్పల్ లోని ఎన్ఐఎన్ కాలనీలో బుధవారం 8 నెలల వయసున్న వైష్ణవ్ అనే చిన్నారి కిడ్నాప్ అయ్యాడు. అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసే నల్లదుర్గ (దుర్గా భవాని) అనే మహిళ బాలుడిని ఎత్తుకెళ్లింది. మేడిపల్లి పోలీసులు మూడు గంటల్లోనే చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
నల్లదుర్గ తల్లిదండ్రులతో 'అమ్మా, చిన్నారిని కిందకు తీసుకెళ్తాను' అని చెప్పి బాలుడిని తీసుకెళ్లింది. కానీ ఆమె నేరుగా ఆటోలో కర్మన్ఘాట్లోని తన ఇంటికి చేరుకుంది. చిన్నారి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెతికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్లో నల్లదుర్గకు మగబిడ్డ జన్మించాడు. కానీ పుట్టిన రెండు రోజులకే ఆ పసికందు మృతి చెందాడు. ఈ విషయాన్ని కుటుంబానికి చెప్పకుండా, తనకు బిడ్డ ఉన్నట్లు నమ్మించేందుకు ఆమె ఈ కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 137(2) కింద కేసు నమోదు చేశారు. ఉప్పల్ డిసిపి, మేడిపల్లి ఏసిపి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి, ఎస్ఐలు శ్రీను, నర్సింగ్, నవీన్, శ్రీకాంత్, శ్రీనివాసస్ రాజులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సిసిటీవీ ఫుటేజీని పరిశీలించి ఆటో రూట్ ఆధారంగా కర్మన్ఘాట్లో నిందితురాలిని అదుపులోకి తీసుకొని చిన్నారిని రక్షించారు.
తన బిడ్డ సురక్షితంగా తిరిగి రావడంతో తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. మల్కజగిరి డిసిపి మేడిపల్లి పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులు అందచేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com