సైబరాబాద్ ఐటీ కారిడార్లో అక్రమ పార్కింగ్పై పోలీసుల ప్రత్యేక దాడులు, రెస్టారెంట్లకు నోటీసులు
సైబరాబాద్ ఐటీ కారిడార్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ సమస్యల నేపథ్యంలో, పోలీసులు రెస్టారెంట్లు, కెఫేలపై ప్రత్యేక దాడులు చేపట్టారు. వీకెండ్స్లో రెస్టారెంట్ల వద్ద రోడ్లపై భారీగా వాహనాలు పార్కింగ్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ పార్కింగ్పై పోలీసులు చర్యలు ప్రారంభించి, హోటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.
హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఉన్నాయి. 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లడానికే 20 నుంచి 40 నిమిషాల సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. రెస్టారెంట్లు సరైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్లు, బైకులు, క్యాబులు, ఫుడ్ డెలివరీ వాహనాలు రోడ్లపై నిలుపడంతో ట్రాఫిక్ నెమ్మదిస్తోంది.
మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జంక్షన్ల వద్ద అదనపు సిబ్బందిని మోహరించినట్లు, అక్రమ పార్కింగ్పై జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్ల యాజమాన్యాలు తప్పనిసరిగా సరిపడా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో సమీపంలోని ఇతర స్థలాల్లో వాహనాలను షిఫ్ట్ చేయడానికి వాలెట్ డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని హోటళ్లకు కంజెషన్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిజిఆర్ ఫ్లైఓవర్-రాడిసన్ జంక్షన్, సీపీ కార్యాలయం నుండి గచ్చిబౌలి (బిచ్చారెడ్డి స్ట్రెచ్) వంటి ప్రాంతాల్లో తక్షణ చర్యగా రివర్స్ లైన్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. సిగ్నల్ టైమింగ్ల్లో మార్పులు, వీకెండ్స్లో ప్రత్యేక నిఘా కూడా కొనసాగుతుందన్నారు. అయితే, నోటీసులు ఇచ్చినప్పటికీ కొన్ని రెస్టారెంట్లు ఇంకా నిబంధనలు పాటించడం లేదని, దీంతో ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com