ఉత్తర భారతంలో భారీ వర్షాలు, వరదలు; పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తం
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. అస్సాంలోని గౌహతిలో రోడ్లపై వరద నీరు నిలిచింది. ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కోల్కతా, హౌరా, హుగ్లీ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ మేదినీపూర్ జిల్లా సబాంగ్, నారాయణగఢ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. రైలు పట్టాలపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. వరద బాధితులకు సహాయం అందిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారి తెలిపారు. చాలా మంది ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లారని, అక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దాదాపు 6 వేల ఇళ్లలోకి నీరు వచ్చిందని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలు నీటిలో మునిగాయి. ప్రయాగ్రాజ్ జిల్లాలో నిన్న ఒక్కరోజే 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలకు నదులు పొంగుతున్నాయి. జలాశయాలు నిండాయి. సలాల్ డ్యామ్ గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం ఉత్తర భారతదేశంలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. రేపు, ఎల్లుండి తూర్పు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com