నైరుతి ఋతుపవనాల ప్రభావంతో UP, హర్యానా, ఢిల్లీలో భారీ వర్షాలు; లోతట్టు ప్రాంతాలు జలమయం
నైరుతి ఋతుపవనాలు దేశమంతా విస్తరించడంతో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గజియాబాద్ లోని వైశాలి సెక్టర్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక ఇళ్లకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నోయిడాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, అండర్పాస్లపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫరీదాబాద్లో కూడా పెద్ద ఎత్తున నీరు నిలిచింది. మేవల మహారాజ్పూర్లో వరద నీరు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీలో ముంపు ప్రాంతాలను CM రేఖా గుప్తా పరిశీలించి సహాయ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కేదార్నాథ్ చార్ధాం యాత్ర మార్గంలో ప్రమాదకర ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాఖండ్కు మరో 24 గంటలు హెవీ రెయిన్ అలర్ట్ ఉండడంతో అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కల్లాడి స్వరంగం నిర్మాణ స్థలం శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాలు వెలికితీశారు. ఒక మృతదేహం నది సమీపంలో కనుగొన్నారు. మరో ముగ్గురు గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు.
వాతావరణ శాఖ ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com