వరి, పత్తి పంటల్లో పురుగుల నియంత్రణకు రైతులకు సమగ్ర సూచనలు
విభిన్న వాతావరణ పరిస్థితులు, అడపాదడపా వర్షాల కారణంగా వరి, పత్తి పంటల్లో పురుగుల తాకిడి పెరిగింది. మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు తెలిపారు.
పత్తి పంటలో రసం పీల్చే పురుగులు (పచ్చదోమ, తామర పురుగులు) ఆకులు రంగు మారడానికి, మొక్కలు సరిగా ఎదగకపోవడానికి కారణమవుతున్నాయి. వీటి నివారణకు అజాడిరెక్టిన్ 1500 ppm ను లీటరుకు 5 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. నీలి రంగు జిగురట్టలను ఎకరానికి 10-20 చొప్పున పెట్టాలి. కాండానికి పూత పూసే పద్ధతి ద్వారా 45 రోజుల దశలో మోనోప్రోపాస్ (1:4 నిష్పత్తి), 60 రోజుల దశలో ఫ్లోనికామిడ్ (1:20 నిష్పత్తి) వాడితే మిత్ర పురుగులను కాపాడుకోవచ్చు.
గులాబీ రంగు పురుగు (పింక్ బోల్వార్మ్) నివారణకు అజాడిరెక్టిన్ 1500 ppm ను 20 లీటర్ల ట్యాంకుకు 100 మి.లీ., స్టికింగ్ ఏజెంట్ కలిపి పిచికారి చేయాలి. లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4-8 పెట్టి, బుట్టలో పురుగుల సంఖ్యను గమనించి అవసరమైతేనే రసాయనిక మందులు వాడాలి.
వరిలో కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారింది. నాట్లు వేసిన 20-25 రోజుల్లో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 7.2 కిలోలు వేయాలి. క్లోరాంట్రానిలిప్రోల్ గుళికలు 4 కిలోలు కూడా వాడవచ్చు. లింగాకర్ష బుట్టలు పెట్టడం కూడా ఉపయోగకరం.
నారుమడి దశలో నాట్లు వేసే 5-7 రోజుల ముందు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 800 గ్రాములు వేయాలి. నాట్లు వేసేటప్పుడు కొనలను తుంచి నాటడం వల్ల పురుగు ఉధృతి తగ్గుతుందని శాస్త్రవేత్త నాగరాజు వివరించారు. సిఫార్సు చేసిన మోతాదులోనే మందులు వాడాలని, పురుగుల ఉదృతిని బట్టి విచక్షణతో వాడాలని ఆయన సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com