వర్షాకాలంలో కూరగాయ పంటల యాజమాన్యంపై ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ సూచనలు
వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయ పంటల్లో సమస్యలు వచ్చాయి. భూమిలో నీరు నిలిచిపోవడం వల్ల మొక్కలు ఎదగడం లేదు. చీడపీడలు, తెగుళ్లు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ పంటల సంరక్షణకు అవసరమైన సూచనలు చేశారు.
రైతులు మొదట తోటల్లో నిలిచిన నీటిని తొలిగించాలని సూచించారు. వేరు కుళ్ళు రాకుండా లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి వేరు భాగం తడిచేలా పోయాలి. కలుపు నివారణకు క్విజల్ఫాప్-ఇథైల్ మందును లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
టమాటా మొక్కలు 25-30 రోజుల వయసు దాటిన తర్వాత వాటికి ఊతం ఇవ్వాలి. వెదురు కర్రలు, దారం ఉపయోగించి మొక్కలకు మద్దతు ఇవ్వాలి. లేదంటే కాయలు నేలకు తాకి కుళ్ళిపోతాయి. మిర్చి నారుమడిలో నారుకులు తెగులు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణం పోయాలి. మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటే 19:19:19 వంటి నీటిలో కరిగే ఎరువు ఇవ్వాలి.
మిర్చికి రసం పీల్చే పురుగులు ఆశించకుండా 1500 ppm వేపనూనెను లీటర్ నీటికి 5 ml కలిపి పిచికారీ చేయాలి. జిగురు కాగితాలు (పసుపు, నీలం) ఎకరానికి 15-20 చొప్పున అమర్చాలి. బెండ, బీర, కాకర, చిక్కుడు వంటి తీగ జాతి పంటల్లో పూత రాలకుండా బోరాన్ (లీటరికి 1 గ్రాము), 13:0:45 వంటి ఎరువులు (లీటరికి 10 గ్రాములు) పిచికారీ చేయాలి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com