శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 85 వేల క్యూసెక్కుల వరద, నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 85,000 క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది.
గడిచిన మూడు రోజుల్లో 11 టీఎంసీల నీరు నిల్వల్లోకి చేరగా, ప్రస్తుతం 26.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, నీటి మట్టం 1071.9 అడుగుల వద్ద ఉంది. గత ఏడాది ఇదే రోజు 38.7 టీఎంసీల నీరు నిల్వ చేరిందని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని బాలేగాం ప్రాజెక్ట్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, స్థానిక క్యాచ్మెంట్ నుంచి మిగతా నీరు చేరుతోంది. ఎల్నినో, అకస్మాత్తుగా ఏర్పడిన డిప్రెషన్ కారణంగా వర్షాలు సకాలంలో రాలేదని, మూడు రోజుల వర్షాలతోనే వరద ప్రారంభమైందని ఈఈ లాల్ సింగ్ వివరించారు.
ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటి మట్టం 1091 అడుగులు చేరిన తర్వాతే గేట్లు ఎత్తే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. నీటి మట్టం ఎప్పుడు నిండుతుందో చెప్పలేమని, వరద రాకను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ రోజు ప్రాజెక్టును సందర్శించనున్నారు.
ఎల్నినో ప్రభావంతో ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేసేందుకు, రూటు పనులను పరిశీలించేందుకు మంత్రి వస్తున్నట్లు ఈఈ తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com