తెలంగాణలో భారీ వర్షాలు: జగిత్యాలలో పాఠశాలలకు సెలవు, బొగ్గు ఉత్పత్తిలో భారీ నష్టం
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.
జగిత్యాల జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల కోసం కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని ఓపెన్కాస్ట్ గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింది. రోజుకు 50,000 టన్నుల ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం విరిగిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో చెట్టును తొలగించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిపై నాటు పడవల రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది.
కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్ పర్యవేక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.
చెన్నూరు పట్టణంలో ఆకాశం నుంచి చిన్న చిన్న చేపలు పడుతున్న ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ గాలుల కారణంగా సమీపంలోని చెరువుల నుంచి చేపలు ఎగిరొచ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com