పర్మనెంట్ లైసెన్స్ ముందు రోడ్ సేఫ్టీ కోర్స్ తప్పనిసరి: తెలంగాణ రవాణ శాఖ కొత్త నిబంధన
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో రవాణ శాఖ కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై లెర్నర్ లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ 2.5 గంటల రోడ్ సేఫ్టీ కోర్స్ పూర్తి చేయాలి. ఆ తర్వాతే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కొత్త కోర్సును ఆన్లైన్లో చేయించనున్నారు. ఇందులో ఆరు మాడ్యూళ్లు, ఒక్కో మాడ్యూల్ 25 నిమిషాల నిడివితో ఉంటాయి. రోడ్డు భద్రతకు సంబంధించిన 64 అంశాలపై 120 వీడియోలు ఉంటాయి. ప్రతి మాడ్యూల్ చివర క్విజ్ నిర్వహిస్తారు. అభ్యర్థి ముఖం కెమెరాకు స్పష్టంగా కనిపించాలి. ఫేస్ రిజిస్ట్రేషన్, ఫేస్ రికగ్నిషన్ తర్వాతే వీడియో ముందుకు సాగుతుంది. కోర్స్ పూర్తిచేసిన వారికి రోడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత డ్రైవింగ్ టెస్ట్కు హాజరై, పాసైతేనే లైసెన్స్ మంజూరు చేస్తారు. కోర్స్ తెలుగుతో పాటు 15 భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
రవాణ కమిషనర్ ఇలంబర్తి అంతర్జాతీయ పద్ధతులను అధ్యయనం చేసి ఈ కోర్సును రూపొందించారు. కూకట్పల్లి ఆర్టీఓ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా, ఇప్పటివరకు 1070 మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 890 మంది కోర్స్ పూర్తిచేశారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, డ్రైవింగ్ టెస్ట్ పాసవ్వడమే కాకుండా డ్రైవర్లలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం ఈ కోర్సు లక్ష్యం.
విదేశాల్లోనూ లైసెన్సింగ్ విధానాలు కఠినంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో యువ డ్రైవర్లు కనీసం 120 గంటల సూపర్వైజ్డ్ డ్రైవింగ్ తప్పనిసరి కాగా, యూకేలో 45 గంటల శిక్షణ, 22 గంటల ప్రాక్టీస్ అవసరం. అమెరికాలో క్లాస్రూమ్ కోచింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ రెండూ పూర్తయితేనే లైసెన్స్ ఇస్తారు. తెలంగాణలో ఇప్పుడు అమలు చేస్తున్న కోర్సు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందని దరఖాస్తుదారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com