నిజామాబాద్లో సర్పంచ్ల వినూత్న ఆలోచనతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుదల
నిజామాబాద్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వినూత్న చర్యలు తీసుకున్నాయి. ఈ చొరవతో ఒకప్పుడు విద్యార్థులు తగ్గి మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలలు ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతున్నాయి.
నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ సర్పంచ్ భోజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల ఐదేళ్ల ఇంటి పన్నును తన సొంత ఖర్చుతో భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ్యులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి ఇతర కుటుంబాలకు ప్రోత్సాహకంగా నిలిచారు.
ఫలితంగా గతంలో 13 మంది మాత్రమే ఉన్న ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు 57 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. మొత్తం విద్యార్థుల సంఖ్య 60 దాటింది. ఇదే జిల్లా మాక్లూరు మండలం ధర్మోరా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తన కుమార్తె శ్రీహితను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఆయన గ్రామస్థులను ఒప్పించి ఒకే రోజు 50 మందికి పైగా అడ్మిషన్లు చేయించారు.
గతాడాది 22 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఇప్పుడు 74 మంది చేరారు. ఆయన సుమారు రూ.3.5 లక్షలు సమీకరించి ఐదుగురు విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ రెండు గ్రామ పంచాయతీల నిర్ణయాలకు మంచి స్పందన లభించింది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి తీసేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చారు. మరికొందరు ఆసక్తి చూపుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com