తెలంగాణ డిజిటల్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2 వేల కోట్ల పెట్టుబడి – డీపీఆర్కు సూచన
తెలంగాణలో డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ప్రపంచ బ్యాంకు రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక) సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సూచించారు.
ప్రపంచ బ్యాంకు డిజిటల్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందాని నేతృత్వంలోని బృందం హైదరాబాద్లోని సచివాలయంలో సంజయ్ జాజుతో భేటీ అయింది. డిజిటల్ ఇండియా, వికసిత భారత్ 2047 లక్షాల సాధన దిశగా మీసేవ కేంద్రాల ఆధునికీకరణ, ఫ్యూచర్ సిటీలో నూతన డేటా సెంటర్ల ఏర్పాటు, AI, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ తదితరాలపై చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్లో అమలు చేస్తున్న సంస్కరణలను ప్రపంచ బ్యాంకు బృందం అభినందించింది. మీసేవ కేంద్రాలను మరింత పటిష్టం చేసి ప్రజలకు సమర్థవంతమైన డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
టీ ఫైబర్ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, గడువులోగా అన్ని పనులు పూర్తి చేసి నాణ్యమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరవడంతో పాటు యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com