APSRTC ప్రైవేటీకరణపై ఉద్యోగుల ఆగ్రహం.. ప్రభుత్వానికి అల్టిమేటం
APSRTC ఉద్యోగ సంఘాలు JAC గా ఏర్పడి ఉద్యమ కార్యచరణ ప్రకటించాయి. అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సభలు నిర్వహించారు. తమ డిమాండ్లను తెలుపుతూ ధర్నాలు, నిరసనలు, గేట్ మీటింగ్లు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం APSRTC లో మొత్తం 53,000 మంది ఉద్యోగులు ఉండగా, 10,000 మంది పదవీ విరమణ చేశారు. మిగిలిన 43,000 మందిలో మరో 10,000 మంది వచ్చే ఏడాదికి పదవీ విరమణ పొందనున్నారు. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో రిక్రూట్మెంట్ జరపడం లేదని, కండక్టర్, డ్రైవర్, మెకానిక్ వంటి దిగువ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం ప్రైవేటీకరణకు దారి చేసుకోవడమేనని APSRTC JAC ఆరోపిస్తోంది.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ నిర్వహణకు సిద్ధం చేయడం ప్రైవేటీకరణ లక్ష్యంలో భాగమేనని JAC పేర్కొంది. స్త్రీ శక్తి పేరుతో వస్తున్న రీయంబర్స్మెంట్ ద్వారా APSRTC స్వయంగా బస్సులు కొనుగోలు చేసి నడపవచ్చని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే నాలుగు డిపోలు పూర్తిగా ప్రైవేట్ కు కట్టబెట్టారని, ఎనిమిది డిపోలు యాభై శాతానికి పైగా ప్రైవేట్ పరం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండవ దశ ఉద్యమ కార్యచరణలో భాగంగా జూలై 7, 8 తేదీలను APSRTC పరిరక్షణ దినాలుగా పాటించాలని నిర్ణయించారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా APSRTC ఉద్యోగులందరూ డిమాండ్లతో కూడిన ప్రింటెడ్ బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారు. జూలై 9 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కలిసి తమ డిమాండ్లను వివరించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
జూలై 19 నుండి 26 వరకు CM కి ఉద్యోగుల ఆవేదనను తెలియజేస్తూ రూపొందించిన వినతి పత్రాలపై APSRTC ఉద్యోగులందరి సంతకాలు సేకరించాలని నిర్ణయించారు. జూలై 27న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా CM కి వినతి పత్రాలు అందజేయనున్నారు. జూలై 30న JAC రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com