కేంద్రం రాష్ట్రాలకు కరోనా అడ్వైజరీ: పరిస్థితి అదుపులోనే ఉంది, భయం వద్దు
కరోనా కేసులు కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య సలహా జారీ చేసింది. ఇది కేవలం సీజనల్ ట్రెండ్ మాత్రమేనని, ప్రజలు భయపడాల్సిన పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసింది.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. కోవిడ్ నోడల్ సెంటర్గా ఉన్న గాంధీ ఆసుపత్రిలో కరోనా నోడల్ అధికారిని నియమించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్లను అప్రమత్తం చేసి నిఘా పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.
గాంధీ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, కోవిడ్ ఇప్పుడు సాధారణ జలుబు లాంటి వ్యాధిగా మారిందని తెలిపారు. కొత్త కేసులు వస్తున్నా, ఆసుపత్రిలో చేరాల్సిన లేదా ఆక్సిజన్ అవసరం పడే పరిస్థితి ఎవరికీ లేదని చెప్పారు. డయాబెటిస్, క్యాన్సర్ పేషెంట్లు, వృద్ధులు, చిన్నపిల్లలు వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జన సమూహాల్లో మాస్క్ ధరించడం మంచిదని డాక్టర్లు సూచించారు. పీసీఆర్ కిట్లు, ప్రత్యేక వార్డులు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయి.
కరోనా వ్యాక్సిన్, సహజ రోగనిరోధక శక్తి వల్ల చాలా మందికి వ్యాధిని తట్టుకునే శక్తి వచ్చిందని, కోవిడ్ తీవ్రం కాదని డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావద్దని, వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com