ఇబ్రాహింపట్నంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేకంగా రైతుల ఆందోళన; కలెక్టరేట్ ముట్టడి
రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బండరావిరాల గ్రామంలోని సర్వే నంబర్ 268 లో 494 ఎకరాల భూమిని ఎకో టౌన్ డంపింగ్ యార్డ్గా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 20 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో బండరావిరాల, చిన్న రావిరాల సహా 15 గ్రామాల ప్రజలు రంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఇబ్రాహింపట్నం మాజీ ఎమ్మెల్యే మంచి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గ్రామస్థులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే పర్యావరణం దెబ్బతింటుందని, చుట్టుపక్కల వేలాది ఎకరాల వ్యవసాయ భూములు పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమై ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం ఉందని వారు తెలిపారు.
భారీ ఆందోళన అనంతరం గ్రామస్థులు, బీఆర్ఎస్ నేతలు కలిసి సబ్ కలెక్టర్ చంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. జీవో 20 ను వెంటనే రద్దు చేయాలని, ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com