హైదరాబాద్: రూ.50 కోట్లకు పైగా అప్పు తీసుకుని సిమెంట్ వ్యాపారి పరార్
హైదరాబాద్ కుషాయిగూడలో సిమెంట్ వ్యాపారి పబ్బా చంద్రశేఖర్ రూ.50 కోట్లకు పైగా అప్పుగా తీసుకుని అదృశ్యమైనట్లు బాధితులు మల్కాజగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చంద్రశేఖర్ కుషాయిగూడ చక్రీపురం భగవాన్ కాలనీలో నివసిస్తూ ‘శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్’ పేరుతో 30 ఏళ్లుగా సిమెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి, ఇంటి నిర్మాణం, కుటుంబ అవసరాలు, జీఎస్టీ బిల్లింగ్ వంటి కారణాలు చెప్పి పలువురి నుంచి డబ్బు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల 22వ తేదీ నుంచి చంద్రశేఖర్ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, భార్యతో కలిసి అదృశ్యమయ్యాడని బాధితులు తెలిపారు. వీరి ఇద్దరు కుమార్తెలను బంధువుల ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాదాపు 60 మందికి పైగా బాధితులు రూ.50 కోట్లకు పైగా నష్టపోయామని, నిందితుడిని అరెస్ట్ చేసి తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com