మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవాలు 27 నుంచి ప్రారంభం
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో 355వ ఆరాధన మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల వారి సమక్షంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వారం రోజుల పాటు ఇవి కొనసాగుతాయి.
27వ తేదీన ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. 29వ తేదీన స్వామి వారి పూర్వారాధన ఉంటుంది. ఆ రోజు సాయంత్రం యోగీంద్ర సభా మండపం బయట వేదికపై రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి కార్యక్రమం జరుగుతుంది. 30వ తేదీన మధ్యారాధన సందర్భంగా మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం తెప్పోత్సవం కూడా జరుగుతుంది.
ఉత్సవాల్లో పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధనలు ప్రధానమైనవి. రాయర మూల బృందావనానికి విశేష పంచామృత అభిషేకాలు, తులసి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తుంగభద్ర నది తీరంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల కోసం ప్రత్యేక షవర్ల నిర్మాణం పూర్తయింది. యోగేంద్ర సభా మండపంలో వారం రోజుల పాటు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com