మిరియాలగూడ అగ్ని ప్రమాదం హత్యగా తేలింది: నిందితుడు శిరీష్ అరెస్ట్
నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదం హత్యగా తేలింది.
మిరియాలగూడకు చెందిన ధనమ్మ భర్త 10 ఏళ్ల క్రితం మరణించాడు. ఆమె తన ఇద్దరు పిల్లలు, తల్లి చంద్రకలతో కలిసి నివసిస్తోంది.
2023లో ధనమ్మ శిరీష్ అనే వ్యక్తిని మాట్రిమోనీ ద్వారా పరిచయమై రెండో వివాహం చేసుకుంది. మనస్పర్థలతో కొద్ది రోజుల్లోనే ఇద్దరూ విడిపోయారు.
ధనమ్మ కుటుంబం తనను దూరంగా ఉంచడం, మరో కేసులో బెయిల్ ఇప్పించకపోవడంపై శిరీష్ ఆగ్రహంతో ఉన్నాడు.
జూన్ 1న జైలు నుంచి విడుదలైన శిరీష్ జూన్ 4 అర్ధరాత్రి ధనమ్మ ఇంటికి చేరుకున్నాడు. నిద్రిస్తున్న చంద్రకల, 10వ తరగతి పూర్తి చేసిన లక్ష్మణ్, 9వ తరగతి చదువుతున్న ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు.
ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు శిరీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఉపాధి కోసం పూణేలో ఉన్న ధనమ్మ ఈ విషయం తెలిసి తీవ్ర దుఃఖంలో ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com