కోల్కతాలో ఇన్వెస్టర్స్తో మంత్రి నారా లోకేష్ భేటీ; ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కోల్కతాలో భారతీయ వాణిజ్య మండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఐదు గంటల వ్యవధిలో 17 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఉదయం యమామి గ్రూప్, వీసా స్టీల్, శ్రీ సిమెంట్ ప్రతినిధులతో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.
ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరితో భేటీ అయ్యి రాష్ట్రంలో కొనసాగుతున్న హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, కుప్పంలో ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ క్లస్టర్ పురోగతిపై చర్చించారు. శ్యాం ఫెర్రో చైర్మన్ బ్రిజ్భూషణ్ అగర్వాల్తో సమావేశమై ఏపీలో రాబోయే వారి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కోల్ ఇండియా లిమిటెడ్, విక్రాంత్ సోలార్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో భేటీ అయ్యి పునరుత్పాదక ఇంధనం, సోలార్ సెల్ బ్యాటరీ తయారీ, ఈవీ రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి భాగస్వామ్యంపై చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బెర్రీ అలాయ్స్ వంటి సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇంకా ఐసీసీ ఐటీ సభ్యులతోనూ ప్రత్యేకంగా సమావేశమై ఏపీలోని ఐటీ జీసీసీ రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. ఈ కోల్కతా పర్యటనలో వివిధ రంగాల కంపెనీలతో చర్చలు జరిపిన మంత్రి లోకేశ్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com