హైదరాబాద్ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో రుతుపవనాల కోసం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో నగరంలోని నాలాల డిస్లిట్టింగ్ (పూడిక తీత) పనులు 90% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల వద్ద చిన్నపాటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.
వాతావరణ మార్పులతో పెరిగే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, నగరంలోని 150 బస్తీ దవాఖానాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
వర్షపు నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. 2016 నుంచి అమల్లో ఉన్న రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నట్టు చెప్పారు. 200 చదరపు గజాలకు మించి విస్తీర్ణం ఉన్న ప్రతి ఇంట్లో నీటి సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.
పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, జలమండలి, విద్యుత్ శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. నగర ప్రజల భద్రత, ఆరోగ్యం, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com