డబ్బులిచ్చి గర్ల్ఫ్రెండ్ అద్దెకు తీసుకోవడం.. వైరల్ అవుతున్న పెయిడ్ కంపానియన్ ట్రెండ్
సోషల్ మీడియా ప్లాట్ఫారం X లో దివ్య అనే మహిళ షేర్ చేసిన ఒక రేట్ కార్డ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఆమె తనను తాను డేటింగ్ పార్ట్నర్లా కాకుండా కేవలం పెయిడ్ కంపానియన్గా పరిచయం చేసుకుంటూ వివిధ సర్వీసులను ఆఫర్ చేసింది.
కాఫీ డేట్కు ₹1500, డిన్నర్ మూవీకి ₹2000, క్లైంట్ ఫ్యామిలీని కలవడానికి ₹3000, ఈవెంట్ లేదా ఫంక్షన్కు ₹3500 అని ఆమె రేట్లు నిర్ణయించింది. ప్రీమియం సర్వీసుల విషయానికి వస్తే బైక్ రైడ్కు ₹4000, షాపింగ్ ట్రిప్కు ₹4500, అడ్వెంచర్ డేకు ₹5000, వీకెండ్ గేట్అవేకు ₹10,000 వసూలు చేస్తున్నట్లు ఆ రేట్ కార్డులో పేర్కొంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయాలంటే అదనంగా ₹6000 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రేట్ కార్డు వెలుగులోకి వచ్చిన తర్వాత ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో రెంటల్ గర్ల్ఫ్రెండ్స్ సంపాదనపై పెద్ద చర్చ జరుగుతోంది. మరో సోషల్ మీడియా యూజర్ క్లెయిమ్ చేసిన ప్రకారం ఇలాంటి ప్లాట్ఫారమ్ల ద్వారా మహిళలు గంటకు దాదాపు ₹1000 వరకు ఆర్జిస్తున్నారు. కొంతమంది మహిళలకు రోజుకు మూడు నుంచి నాలుగు బుకింగ్లు వస్తున్నాయని, దీని వల్ల రోజుకు ₹6000 నుంచి ₹7000 వరకు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.
సామాజిక నిపుణులు ఈ ట్రెండ్ను విశ్లేషిస్తూ పట్టణాల్లో పెరుగుతున్న ఒంటరితనానికి ఇది అద్దం పడుతుందని అంటున్నారు. మనుషులు ఎంతలా ఒంటరి అయిపోయారంటే కాలక్షేపం చేయడానికి డబ్బులిచ్చి తోడు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి గిగ్ ఎకానమీలో ఇదొక ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియా అంటూ కొందరు సమర్థిస్తున్నారు. అయితే మహిళల భద్రత, దోపిడీ అవకాశం, పర్సనల్ బౌండరీస్ దెబ్బతినే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సర్వీసుల్లో కఠినమైన భద్రతా చర్యలు, స్పష్టమైన నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com