వీవీఐటీ గ్రాడ్యుయేషన్ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు
గుంటూరు జిల్లా VVIT (వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ) లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్కృతి, సాంప్రదాయాలు, క్రమశిక్షణల ప్రాముఖ్యతను వివరించారు. ఇష్టపడి చదువుకుంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. 2045 నాటికి భారతదేశం మరింత శక్తివంతం కానుందని, ఆ దిశగా విద్యార్థులు సిద్ధపడాలని తెలిపారు.
ఉపరాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత తాను రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మాతృభాష యొక్క ప్రాముఖ్యతను యువతకు తెలియజేయడం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం ఆ రెండు లక్ష్యాలని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయం అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. యూనివర్సిటీ నాయకత్వాన్ని, ప్రత్యేకించి విద్యాసాగర్ వాసిరెడ్డిని అభినందించారు. విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని, భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా దేశ సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com