ఏపీలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు నేడు ఉన్నతస్థాయి సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సచివాలయంలో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వరకు దాదాపు 1300 మంది పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
సమావేశంలో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ల అరాచకాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై చర్చించనున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, శాంతిభద్రత పర్యవేక్షణపై సీఎం స్వయంగా సమీక్షించనున్నారు.
తన వద్ద ఉన్న క్షేత్ర స్థాయి నివేదికలను అధికారుల ముందుంచి విశ్లేషించనున్నారు. మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరుకానుండగా, జిల్లా స్థాయి అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com