గుప్త నవరాత్రుల్లో వారాహి దేవి 9 రోజుల పూజా విధానం
గుప్త నవరాత్రులు వారాహి దేవి ఆరాధనకు ప్రత్యేకమైన రోజులు. ఈ తొమ్మిది రోజుల్లో నిర్దిష్ట దీపాలు, నైవేద్యాలు, శ్లోకాలతో అమ్మవారిని పూజించడం ఆచారంగా ఉంది. పండితుల సూచనల ప్రకారం, ప్రతి రోజు ఒక ప్రత్యేక అవతారంలో వారాహి దేవిని కొలవడం వల్ల వివిధ సమస్యలు సమసిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
మొదటి రోజు ఆదివారాహి అవతారంలో పూజిస్తారు. కందదీపం వెలిగించి పెరుగన్నం లేదా పానకం సమర్పిస్తారు. ‘ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వారాహి ధరణీం ధ్రువం హుం ఫట్ స్వాహ’ అనే శ్లోకం పఠిస్తే భూమి, ఇల్లు, కోర్టు సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
రెండవ రోజు బృహద్వారాహిగా కొలుస్తారు. పంచగవ్య దీపం వెలిగించి దానిమ్మ గింజలు నైవేద్యంగా పెడతారు. ‘బృహద్వారాహి ముఖేన సదా’ శ్లోకాన్ని జపిస్తే రక్త సంబంధ దోషాలు, నరదిష్టి, శత్రు భయం తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
మూడవ రోజు స్వప్నవారాహిగా అమ్మవారిని ఆరాధిస్తారు. కొబ్బరి దీపం వెలిగించి మినపగారలు నివేదిస్తారు. ‘ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం కథయ కథయ స్వాహ’ అని 11 సార్లు చదివితే సమస్యలకు కలలో పరిష్కారం లభిస్తుందని ప్రతీతి.
నాలుగవ రోజు ధూమ్రవారాహి పూజ. నీటి మీద జలదీపం వెలిగించి పులిహోర సమర్పిస్తారు. ‘ధూమ్రవారాహి సమాయుక్తే’ శ్లోకం వల్ల దీర్ఘకాలిక రోగాలు, శత్రు బాధలు, భూతగాదాలు నివారణౌతాయని నమ్ముతారు.
ఐదవ రోజు కిరాత వారాహి పేరుతో కొలుస్తారు. వరిపిండి బెల్లంతో పిండి దీపం వెలిగించి చక్కెర పొంగలి నివేదించాలి. ‘ఓం నమో కిరాత వారాహ్యై ధనధాన్యం ప్రదేహిమే’ శ్లోకంతో అప్పులు తీరి ధన ప్రాప్తి కలుగుతుందని ఆచారం.
ఆరవ రోజు ఉన్మత్త వారాహి ఆరాధన. ఉప్పు దీపం వెలిగించి కొబ్బరి అన్నం సమర్పిస్తారు. ‘ఉన్మత్త వారాహి మహాదేవి సర్వజనం మమవసం కురుకురు స్వాహ’ శ్లోకం వల్ల తాంత్రిక బాధలు, దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
ఏడవ రోజు లఘువారాహి పూజ. బెల్లం ముద్దపై బెల్లం దీపం వెలిగించి అటుకులు బెల్లం నివేదించాలి. ‘లఘువారాహి నమస్తుభ్యం సంతాన సౌఖ్యం దేహిమే’ శ్లోకంతో కుటుంబంలో అన్యోన్యత, సంతాన సౌఖ్యం కలుగుతుందని భావిస్తారు.
ఎనిమిదవ రోజు అశ్వారూఢ వారాహిగా పూజలు. నవధాన్యాల దీపం వెలిగించి నువ్వుల అన్నం లేదా నువ్వుల లడ్డు సమర్పించాలి. ‘అశ్వారూఢే అప్రతిరోధే’ శ్లోకాన్ని జపిస్తే గ్రహదోషాలు నివారణై ఆగిపోయిన పనులు వేగంగా పూర్తౌతాయని నమ్మకం.
తొమ్మిదవ రోజు మహావారాహి పూజతో ముగింపు. కూష్ండ దీపం వెలిగించి పూర్ణం బూరెలు లేదా పరమాన్నం నివేదిస్తారు. ‘ఓం ఐం గ్లౌం మహావారాహి సర్వదుష్టా నివారయ’ అనే రాజశ్లోకం పటిస్తే సర్వ దోషాలు తొలగిపోయి అమ్మవారి సంపూర్ణ రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఈ విధంగా తొమ్మిది రోజుల పూజా క్రమాన్ని భక్తితో ఆచరిస్తే వారాహి దేవి కృప కలుగుతుందని విశ్వసిస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com